650409791_1499237825094132_4899579309134646452_n

1ఎల్ కాలువకు నిరంతర నీటి విడుదల చేయాలి: కడియం శ్రీహరి

తాజా వార్తలు

తీగరం–హిమ్మత్‌నగర్ మధ్య 1ఎల్ కాలువ పరిశీలన

ఏప్రిల్ 10 వరకు నీటి విడుదల కొనసాగించాలి.. అధికారులకు ఆదేశం

స్టేషన్ ఘనపూర్, మార్చి 14: ఆయకట్టు పరిధిలోని పంట పొలాలకు సాగునీరు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. శనివారం జఫర్‌గడ్ మండలం తీగరం–హిమ్మత్‌నగర్ గ్రామాల మధ్య ఉన్న 1ఎల్ కాలువను ఆయన సాగునీరు పారుదల శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువ ప్రస్తుత పరిస్థితి, నీటి ప్రవాహం మరియు సాగు నీటి అవసరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

6 వేల ఎకరాలకు భరోసా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 1ఎల్ కాలువ కింద సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం పంటలు చేతికొచ్చే దశలో ఉన్నందున నీటి సరఫరా అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందాలంటే కనీసం 50 క్యూసెక్కుల నీటి విడుదల అవసరమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకుండా, ఏప్రిల్ 10వ తేదీ వరకు నిరంతరాయంగా నీటి విడుదలను కొనసాగించాలని అధికారులకు సూచించారు.

మౌలిక వసతుల కల్పనపై దృష్టి సాగునీటి నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు మెయిన్ కెనాల్ వద్ద తక్షణమే రెగ్యులేటర్ మరియు షేటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వచ్చే వర్షాకాలం ప్రారంభానికి ముందే 1ఎల్ కాలువ లైనింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. లైనింగ్ పనులు పూర్తయితే నీటి వృధాను అరికట్టవచ్చని, తద్వారా చివరి ఆయకట్టు రైతులకు కూడా సమృద్ధిగా నీరు అందుతుందని ఆయన వెల్లడించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *