ఎల్లారెడ్డి, మార్చి 29 (V59 న్యూస్):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పంగిడి మైసమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మహిమాన్విత తల్లిగా పేరుగాంచిన అమ్మవారికి గ్రామస్తులు అత్యంత వైభవంగా బోనాలు సమర్పించారు. ఏటా నిర్వహించే ఈ వేడుకను ఈసారి కూడా గ్రామస్థులందరూ ఐక్యమత్యంతో పండుగ వాతావరణంలో నిర్వహించారు.
భక్తి పారవశ్యం.. ఆటపాటల కోలాహలం:
ఆదివారం ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. మహిళలు కొత్త బట్టలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు దరువులకు యువకులు వేసిన స్టెప్పులు గ్రామంలో సందడిని రెట్టింపు చేశాయి. తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం:
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వెంకటాపూర్ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో ఉత్సవం విజయవంతమైంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు.