ఎల్లారెడ్డి (వెంకటాపూర్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కొలువుదీరిన పంగిడి మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది.
ఆదివారం ఉదయం నుంచే గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన పెట్టుకుని, డప్పు వాయిద్యాలు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ ఇష్టదైవానికి నైవేద్యాలు సమర్పించి, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు.
గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు మరియు యువత ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఉత్సవాలు విజయవంతమయ్యేలా కృషి చేశారు. వెంకటాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బంధుమిత్రుల రాకతో గ్రామంలో సందడి నెలకొంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.