కామారెడ్డి జిల్లా,బీర్కూర్, V59 News: ఉగాది పండుగ అంటేనే సంప్రదాయ క్రీడల సందడి. బిర్కూర్ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాల మైదానం ఆదివారం మల్లయోధుల గర్జనతో హోరెత్తింది. వీర హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే కుస్తీ పోటీలు ఈసారి కూడా అత్యంత ఉత్సాహంగా జరిగాయి.
తెలంగాణ వర్సెస్ మహారాష్ట్ర:
ఈ పోటీల కోసం కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా గట్టి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో మహారాష్ట్రకు చెందిన పీరాజీ తన అద్భుతమైన పట్టులతో ప్రత్యర్థిని చిత్తు చేసి రూ. 5,000 నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు.
సర్పంచ్ చేతుల మీదుగా పురస్కారం:
విజేతగా నిలిచిన పీరాజీకి బిర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో వీర హనుమాన్ కమిటీ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరమేష్ పంతుల్, యమ రాములు, డీలర్ నర్సింలు, రాములు, సింగని పిరయ్య, గంగుల్, వీర హనుమాన్ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని సందడి చేశారు. మన మట్టి క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.